seasonal diseases: ఈ జాగ్రత్తలు పాటిస్తే సీజనల్ వ్యాధులు ధరి చేరవు..!

Seasonal diseases

Seasonal diseases

seasonal diseases: ఇటీవల కాలంలో వర్షాలు భారీగా కురిశాయి. పల్లెలు పట్టణాలు అనే తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో వరద నీరు విపరీతంగా ప్రవహించింది. మరి కొన్ని ప్రాంతాల్లో అయితే బురద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. వాతావరణం ఉన్నట్టుంది మారడంతో సీజనల్ వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే చాలా ప్రాంతాల్లో చాలా మంది సీజనల్ జ్వారాలతో మంచం ఎక్కారు. తెలంగాణ ప్రభుత్వం అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఫీవర్ సర్వే చేయించాలని కూడా భావిస్తుంది. దీనిపై మంత్రి హరీష్ రావు కూడా స్పందించారు. ఇదిలా ఉంటే.. ఇంతకీ సీజనల్ వ్యాధులు అంటే ఏంటి? ఎలా వస్తాయి అనేది తెలుసుకుందాం.

సీజనల్ వ్యాధులంటే..

seasonal diseases: దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ సమస్యలు, తిన్న ఆహారం జీర్ణంకాక పోవడం వంటివి సీజనల్ వ్యాధులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వర్షాకాలంలో వచ్చే మరి కొన్ని వ్యాధులు ఇన్‌ఫ్లుఎంజా, మలేరియా, డెంగ్యూ జ్వరం, టైఫాయిడ్ జ్వరంతో పాటు హెపటైటిస్- ఏ. ఈ వ్యాధులు ప్రధానంగా వెలుగు చూస్తుంటాయి. ఈ వ్యాధులు బారిన అన్నీ వయసుల వారు పడుతుంటారు. కానీ చిన్న పిల్లలు, వృద్ధుల్లో  ఈ వ్యాధుల వలన ఎక్కువ హానీ ఉంటుందని మణిపాల్ ఆసుపత్రి వైద్యులు డా. సీహెచ్. మనోజ్ కుమార్ అంటున్నారు. 

ప్రాణాంతక జ్వరం..

ఈ వ్యాధులు సోకడానికి ప్రధానంగా కలుషిత ఆహరం, మురికి నీరు, ఎక్కవ కాలం ఒకే ప్రాంతంలో నిలిచి ఉన్నమురుకి నీరు, వాటి పై వాలి ఉంటే దోమలు ఈ వ్యాధులకు ప్రధాన కారణం కానున్నాయి. అంతేగాకుండా ఈ సమయాల్లో చాలా మంది దగ్గుతూ కనిపిస్తారు. ఇలా ఒకరి నుంచి మరోకరికి దగ్గు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా దోమల వల్ల వ్యాపించే మలేరియా , డెంగ్యూ వంటి వ్యాధులు కొన్ని సార్లు మరింత ప్రమాదకరమైనవిగా మారుతాయి. అందుకే వాటిని ముందుగా గుర్తించి అశ్రద్ధ చేయకుండా.. చికిత్స చేయించుకోవాలి. ఇలాంటి సమయాల్లోనే ‘స్క్రబ్ టైఫస్’ అనే ప్రాణాంతక జ్వరం కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ జ్వరం కూడా డెంగ్యూ జ్వరాన్ని పోలి ఉంటుంది. కానీ దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. కరోనా మహమ్మారి రాకతో సాధారణ జలుబుకు, కరోనాకు మధ్య తేడా గుర్తించడం చాలా కష్టంగా మారిందని వైద్యులు చెప్తున్నారు. అందుకే జలుబు విషయంలో అజాగ్రత్తగ వ్యవహరించడం తగదని అంటున్నారు.

టైఫాయిడ్ లేదా కలుషిత ఆహారం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి లక్షణాలు మనుషుల్లో కనిపించినట్లు అయితే నిర్లక్ష్యం చేయకుండా. వెంటనే  డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం. అనంతరం వైద్యుల సూచనల మేరకు కామెర్లు మలేరియా, డెంగ్యూ జ్వరం, స్క్రబ్ టైఫస్, లెప్టోస్పిరోసిస్, హెపటైటిస్ –ఏ పరీక్షలు చేయించుకోవాలి.

సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు:

  1. రెండు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా  చేయడం వల్ల కరోనాను అరికట్టడంతో పాటు అతిసార వ్యాధిని కూడా దూరంగా పెట్టవచ్చు.
  2. తీసుకునే ఆహారం, తాగే నీటి విషయంలో జాగ్రత్త వహించాలి. కలుషిత ఆహారం, నీటిని దూరంగా ఉంచడం వల్ల డయేరియా, టైఫాయిడ్ జ్వరం నుంచి రక్షణ పొందవచ్చు.
  3. డెంగ్యూ, మలేరియాల జ్వరాలు సోకకుండా ఉండాలి అంటే ఈ కాలంలో దోమలు కుట్టకుండా దోమతెరలు, రిపెల్లెంట్లు ఉపయోగించాలి.
  4. మనం నివసిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చుట్టుపక్కలా ఎక్కడా మురుగు నీరు నిలిచిపోకుండా చూసుకోవాలి.
  5. వీలైనంత వరకు తాజా ఆహారాన్ని తీసుకోవడంతో పాటు కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు.
  6. పానీపూరీ , పండ్ల రసాలు, ఇతర జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి.
  7. మాస్క్ ధరించడం వల్ల సాధారణ జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ వ్యాధుల నుంచి దూరంగా ఉండడమే కాకుండా.. కొవిడ్ నుంచి కూడా జాగ్రత్త వహించవచ్చు.

  – డాక్టర్. సీహెచ్. మనోజ్​కుమార్, సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, మణిపాల్ హాస్పిటల్స్, విజయవాడ

Leave a Reply

Your email address will not be published.