భారీగా తగ్గిన కరోనా వ్యాక్సిన్ ధరలు… ఎంతంటే?

ప్రికాషన్ డోసుల వినియోగానికి కేంద్రం అనుమతించిన వేళ కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధరలను తగ్గిస్తున్నట్లు టీకా తయారీ సంస్థలు ప్రకటించాయి. 1200 రూపాయిలుగా ఉన్న కొవాగ్జిన్ టీకా ధరను, 225కి తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. ప్రికాషనరీ టీకాపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఆ సంస్థ జేఎండీ సుచిత్రా ఎల్లా తెలిపారు. కేంద్రంతో మాట్లాడిన తర్వాత కొవాగ్జిన్ టీకా ధరను తగ్గించినట్లు చెప్పారు. సీరం కూడా కొవిషీల్డ్ టీకా ధరను 225కు తగ్గించింది. తగ్గించిన ధరలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని భారత్ బయోటెక్, సీరం సంస్థలు తెలిపాయి. రేపటి నుంచి 18 ఏళ్లు పైబడిన అందరు ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్ డోసు వేసుకునేందుకు కేంద్రం అనుమతించింది.
18 ఏళ్లు పైబడిన వారికి కూడా కరోనా ప్రికాషన్ టీకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. ఏప్రిల్ 10 నుంచి అన్ని ప్రైవేటు టీకా కేంద్రాల్లో ప్రికాషన్ డోసులు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. రెండో డోసు టీకా తీసుకొని 9 నెలలు నిండిన వారు ప్రికాషన్ డోసు తీసుకోవచ్చని సూచించింది. ప్రస్తుతం దేశంలో 60 ఏళ్లు పైబడిన వారికి, ఆరోగ్య కార్యకర్తలకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు కేంద్రమే ఉచితంగా ప్రికాషన్ డోసులు అందిస్తోంది. ఇప్పటివరకు 2.4 కోట్ల ప్రికాషన్ డోసులను కేంద్రం పంపిణీ చేసింది.